తేయాకు తోటలకూ కరోనా ఎఫెక్ట్ !


కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ ప్రభావం డార్జిలింగ్ తేయాకు తోటలపైనా పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఈ తేయాకు తోటలు ఇప్పుడు ఎండిపోతున్నాయి. ఫలితంగా మొదటి ఫ్లష్‌కు తీవ్ర నష్టం జరిగింది. అత్యుత్తమ తేయాకు పొడి తయారీకి అవసరమయ్యే మంచి ఆకులు మొదటి ఫ్లష్‌లోనే దొరుకుతాయి. విదేశాలకూ దీన్ని ఎగుమతి చేస్తారు. ఇప్పుడు రెండో ఫ్లష్‌కు కూడా ప్రమాదం పొంచి ఉంది. లాక్‌డౌన్ ఈ రంగాన్ని పెద్ద దెబ్బ తీసింది. తేయాకు తోటలను సాధారణం కన్నా సగం మంది కార్మికులతో నిర్వహించుకోవచ్చని కేంద్రం ఏప్రిల్ 11న అనుమతి ఇచ్చింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 15 శాతం కార్మికులతో నిర్వహంచుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది.

డార్జిలింగ్‌లోని తరాయీ కొండ ప్రాంతం, దాని పక్కనే ఉండే వువార్స్ మైదాన ప్రాంతంలో చిన్నవి, పెద్దవి కలుపుకొని 353 తేయాకు తోటలు ఉన్నాయి. వీటిలో 3.5 లక్షల మంది శాశ్వత, తాత్కాలిక కార్మికులు పనిచేస్తున్నారు. రూ.176 రోజు కూలీతోపాటు వారం వారం రేషన్ కూడా వారికి అందుతుంది. కొండ ప్రాంతంలోని తేయాకు తోటలకు ఈ లాక్‌డౌన్ వల్ల ఎక్కువ నష్టం జరిగింది. ఫ్లష్ అంటే ఆకులను తెంపడం. ‌‌లాక్‌డౌన్ వల్ల మొదటి ఫ్లష్‌కు తీవ్ర నష్టం జరిగింది. అత్యుత్తమమైన, ఖరీదైన తేయాకు పొడికి అవసరమైన ఆకులు కొండ ప్రాంతంలోని తోటల్లో ఈ సీజన్‌లోనే వస్తాయి. ఇప్పుడు రెండో ఫ్లష్‌కు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. మే 3న లాక్‌డౌన్ ఎత్తేసినా, ఆకులు తయారవ్వడానికి కనీసం మరో వారం సమయం పడుతుంది. కేంద్రం తోటల్లో 50 శాతం మంది కార్మికులు పనిచేయొచ్చని చెప్పినా కార్మికుల్లోనూ కరోనా భయం ఎక్కువగా ఉంది. తేయాకు రంగ ప్రతినిధులతో సమావేశం తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.

‘‘పచ్చి ఆకులను తెంపకపోతే, కొన్ని రోజుల్లో పనికిరాకుండా పోతాయని తోటల యజమానులు అంటున్నారు. 15 శాతం కార్మికులతో పనిచేయించుకునేందుకు అనుమతి ఇస్తున్నాం. కానీ, అన్ని రక్షణ చర్యలూ తీసుకోవాలి’’ అని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తున్నామని, కార్మికుల సంక్షేమం తమ తొలి ప్రాధాన్యం అని డార్జిలింగ్ టీ అసోసియేషన్ (డీటీఏ) అధ్యక్షుడు బినోద్ మోహన్ అన్నారు. ‘‘మొదటి ఫ్లష్‌లో దాదాపు వంద శాతం తేయాకు పొడి ఎగుమతి అవుతుంది. ఇలాంటి నాణ్యమైన ఉత్పత్తి కోల్పోవడం తోట వార్షిక ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని డీటీఏ మాజీ అధ్యక్షుడు అశోక్ లోహియా చెప్పారు.

డార్జిలింగ్ కొండ ప్రాంతంలోని 87 తోటల్లో ప్రతి ఏడాదీ దాదాపు 80 లక్షల కిలోల తేయాకు పొడి ఉత్పత్తి అవుతుంది. నాలుగింట ఒక వంతు మొదటి ఫ్లష్‌లోనే వస్తుంది. రెండో ఫ్లష్‌లో 15 శాతం వస్తుంది. మొత్తం దేశంలో ఉత్పత్తయ్యే తేయాకులో డార్జిలింగ్ వాటా తక్కువే. కానీ, ఈ తేయాకుకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. 2011లో యూరోపియన్ యూనియన్ దీనికి జీఐ హోదా కూడా ఇచ్చింది. లాక్‌డౌన్ వల్ల తీవ్ర నష్టం జరిగిందని, మొదటి ఫ్లష్‌లో కేవలం 200 కిలోల తేయాకు పొడి మాత్రమే తయారైందని బినోద్ మోహన్ అన్నారు. లాక్‌డౌన్ ముగిసేసరికి ఈ రంగం చాలా దెబ్బతింటుందని ఆయన అన్నారు. మే 3న లాక్‌డౌన్‌ను తొలగించినా, నాణ్యమైన తేయాకు పొడి తయారు చేసే పరిస్థితి లేదని చెప్పారు. ఉత్పత్తి నిలిచిపోవడంతో చాలా తోటలకు నగదు కొరత ఏర్పడింది. కార్మికులకు కూలీలు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ విషయంలో తమకు సహకారం అందించాలని డీటీఏ ప్రభుత్వాన్ని కోరింది.

ఈ సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఈ రంగానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తేయాకు తోటల యజమానుల సంఘం కన్సల్టేటివ్ కమిటీ ఆఫ్ ప్లాంటేషన్ అసోసియేషన్ (సీసీపీఏ) డిమాండ్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు 12 లక్షల మంది కార్మికులకు రోజుకూలీ దొరకని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. లాక్‌డౌన వల్ల తేయాకు రంగానికి కనీసం రూ.1400 కోట్ల నష్టం జరగవచ్చని చెప్పింది. కార్మికులకు జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వ సాయం అవసరం అంటూ కేంద్ర వాణిజ్య మంత్రికి సీసీపీఏ అధ్యక్షుడు వివేక్ గోయంకా లేఖ రాశారు.

తేయాకు రంగం మిగతా రంగాల కన్నా చాలా భిన్నమైనదని, ఖర్చులో దాదాపు 60 నుంచి 65 శాతం కూలీలపైనే వెచ్చించాల్సి వస్తుందని సీసీపీఏ తెలిపింది. పని చేయించుకోకుండా కూలీ చెల్లించాల్సి వస్తే మొత్తం ఖర్చు ఆరు శాతం పెరుగుతుందని, దీనికి తోడు అమ్మకాలు కూడా 15 శాతం పడిపోతాయని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత తేయాకుకు శ్రీలంక, కెన్యా తేయాకులతో తీవ్ర పోటీ ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో రెండో ఫ్లష్‌లోనూ తేయాకు పొడి ఉత్పత్తి కాకపోతే మార్కెట్ చేజారే ప్రమాదం ఉందని డార్జిలింగ్ టీ అసోసియేషన్ హెచ్చరించింది. గూర్ఖాల్యాండ్ డిమాండ్‌తో 2007లో చేపట్టిన 104 రోజుల బంద్ ప్రభావం నుంచే డార్జిలింగ్ కొండ ప్రాంత తేయాకు తోటలు ఇప్పటికీ కోలుకోలేకపోయాయని, ప్రస్తుత లాక్‌డౌన్‌తో ఈ రంగం వెన్ను విరిగినట్లైందని స్థానిక తేయాకు తోటల యజమానులు అంటున్నారు. అప్పట్లో డార్జిలింగ్ తేయాకు పొడిని చాలా మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు తమ జాబితాల నుంచి తీసేశారని, మరో దెబ్బ పడటం ఈ రంగాన్ని కోలుకోలేకుండా చేయొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !